Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017


     భారతదేశాన్ని పరిపాలించిన మొగలాయి చక్రవర్తులలో అక్బర్ గొప్పవాడు. మతసామరస్యంలో అక్బర్ చక్రవర్తి చరిత్ర చాలా గొప్పది. అక్బర్ పుట్టినప్పుడు తండ్రి హుమయూన్ రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో ఉన్నాడు. 1542 లో హుమయూన్ చక్రవర్తి తన కుమారుడు అక్బర్ జన్మించిన సందర్భంలో తన వద్ద ఉన్న సుగంధద్రవ్య కస్తూరిని తన వారందరికి పంచిపెట్టాడు. తన కుమారుని కీర్తి ప్రతిష్టలు కస్తూరి సువాసనలవలే దేశమంతటా వ్యాపించాలని ఆశించాడు.
తండ్రి ఆశించినట్లే అక్బర్ చక్రవర్తి దేశంలో మంచి పేరుప్రఖ్యాతలు పొందాడు. అక్బర్ మంచి సమరస్యము కలిగిన వ్యక్తి, హాస్యప్రియుడు. అతని దర్బారు ప్రతిరోజు పండితులతో, కవులతో, సామంతులతో, ఉద్యోగులతో ఎంతో వేడుకగా సమర్థవంతంగా ఉండేది.

     బీర్బల్ ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. బీర్బల్ అసలుపేరు "మహేష్ దాస్". అతను ఒక బ్రాహ్మణుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. దగ్గరి బంధువులు చేరదీసి పెంచిపోషించారు. పసితనం నుండే బీర్బల్ విద్యాబుద్ధులందు మంచి వివేకము, ఉత్సాహము, చాతుర్యము ప్రదర్శిస్తుండేవాడు. అందరితో పొత్తుగా, వినయంగా,మృదువుగా మాట్లాడుతుండేవాడు. ఈ మంచి గుణముల వల్ల బీర్బల్ ఎదుటివారికి వినోదము కలిగేలా మాట్లాడేవాడు. మంచి సమయస్పూర్తి పసితనం నుండే అబ్బింది. ఎదుటి వారితో యుక్తిగా మాట్లాడి వారిని మెప్పించేవాడు.

    మహామేధావియైన బీర్బల్ వివేకవిద్యాసంపన్నుడై ఉన్నప్పటికీ దరిద్రముతో చాలా బాధపడుతూ ఉండేవాడు. గ్రామములోని పెద్దలు అతనిని అక్బర్ వద్దకి వెళ్లి ఆశ్రయించమని ప్రోత్సహించేవారు. బీర్బల్ ఢిల్లీకి బయలుదేరి అక్బర్ కోటకి వెళ్ళాడు. రాజభటులు అతనిని కోటలోనికి వెళ్లనివ్వలేదు. తిరిగి తిరిగి ఒకనాడు కొన్ని గుడ్డలను ఒక పెద్దమూటగా కట్టుకొని కోట ముందుకు వెళ్ళాడు. భటులు కోపంతో "ఓయీ! కట్టుగుడ్డయినా లేని నిన్ను లోనికి పంపించం" అన్నారు. "అయ్యలారా! ఆగ్రహించకండి, నేను నిరుపేదనే, కానీ రాజుగారికి మేలుచేయగల విషయమొకటి చెప్పవలెనని వచ్చితిని. మీరు లోనికి పంపినచో ప్రభువు దర్శనం చేసుకొని విషయం చెప్పి వారి మెప్పును పొందగలను. మెచ్చుకున్న ప్రభువులు నాకిచ్చు పారితోషికములో సగము మీకిచ్చెదను. నన్ను లోనికి అనుమతించండి" అని వేడుకున్నాడు. సరే అని భటులు బీర్బల్ ని లోనికి వెళ్లనిచ్చారు. కొంతదూరం వెళ్లగా రెండవ ద్వారం వద్ద భటులు మళ్ళీ అడ్డగించారు. "తనకి వచ్చే బహుమతిలో సగభాగం మొదటిద్వారం దగ్గర ఉన్న భటులకి ఇస్తానని వాగ్ధానం చేశాను, మిగిలిన దానిలో సగభాగం మీకు ఇచ్చుకుంటాను" అని బ్రతిమలాడి బీర్బల్ ఆ ద్వారం దాటాడు. మరికొంత దూరంలో ఉన్న మూడవ ద్వారం దగ్గర మిగిలిన నాల్గవభాగం ఇస్తానని చెప్పి అక్బర్ దర్బారులోనికి ప్రవేశించాడు. అక్కడి భటులు బీర్బల్ ని అవతలికి గెంటివేయబోయారు. అక్బర్ ఆ అలికిడి విని, బీర్బల్ వాలకాన్ని చూసి చిరాకుపడి "వంద కొరడా దెబ్బలు కొట్టి వాడిని అవతలికి తరిమేయండి" అని ఆజ్ఞాపించాడు.

    భటులు అక్బర్ ని కొరడాలతో కొట్టబోగా "అయ్యలారా! కంగారు పడకండి. పాదుషావారు నాకు ఇచ్చేదానిలో సగభాగం మొదటి ద్వారం వారికీ, మిగిలిన దానిలో సగం రెండవ ద్వారం వారికీ, మిగిలిన దానిని మూడవ ద్వారం దగ్గర ఉన్న భటులకి పంచిపెడతానన్న నా మాటని నిలబెట్టుకోనివ్వండి" అని వేడుకున్నాడు. పరిస్థితిని, విషయాన్నీ తెలియజెప్పిన బీర్బల్ విజ్ఞతని గమనించిన అక్బర్, భటులని శిక్షించి, బీర్బల్ కి తన ఆస్థానానికి స్వేచ్ఛగా వచ్చిపోయే అనుమతిని ఇచ్చాడు. అప్పట్నుంచి బీర్బల్ తరచూ పాదుషా వారి దర్శనం చేసుకునేవాడు.

  అలా కాలం గడుస్తూ ఉండగా అక్బర్ పాదుషా వారికి తమ చిత్రపటాన్ని చిత్రీకరింపజెయ్యాలన్న ఆసక్తి కలిగింది. ఒకనాడు దర్బారులో తన అభిలాషను ప్రకటించారు. యధాతథంగా తమ చిత్రాన్ని వేసిన చిత్రకారునికి వెయ్యి బంగారు నాణేలు ఇస్తామని, చిత్రాన్ని నెలరోజుల తర్వాత ఫలానా తేదీనాడు దర్బారుకు తెచ్చి తమకు సమర్పించాలని ప్రకటించారు.

  దేశంలోగల చిత్రకారులంతా తమ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అక్బర్ వారి చిత్రాన్ని చిత్రీకరించారు. నిర్ణీతరోజున చిత్రకారులంతా తమ తమ చిత్రాలను పాదుషావారికి చూపించారు. అయితే, ఏ ఒక్కరు వేసిన చిత్రం కూడా అక్బర్ చక్రవర్తి మనసును మెప్పించలేదు. ఆ వరుసలో బీర్బల్ ముందుకు వచ్చి "జహాపనా! దీనిని చిత్తగించండి, ముమ్మార్తులా మీకు సాటిగా ఉంటుంది" అని గుడ్డతో చుట్టిపెట్టిన దానిని ప్రభువు ముందుంచాడు. "బీర్బల్, నీకు చిత్రలేఖనం కూడా వచ్చునా? నీవు కూడా అందరివలనే అంతంతమాదిరిగానే చిత్రీకరించావా?" అని ప్రశ్నించి ఏది చూపించమన్నారు అక్బర్ పాదుషా. బీర్బల్ ఒక నిలువుటద్దాన్ని అక్బర్ పాదుషా ముందుంచాడు. "చూడండి ప్రభూ! కొంచెం కూడా తేడా ఉండదు" అన్నాడు. అద్దంలోని తన ప్రతిబింబాన్ని చూసి బీర్బల్ ఆంతర్యాన్ని గ్రహించాడు. దేవుడి సృష్టికి ప్రతిసృష్టి చేయడం సాధ్యపడే విషయం కాదు. ఎంతటి పనివాడికైనా ఎదో ఒక లోపం ఉంది తీరుతుంది. ఈ విషయం తెలిసొచ్చేలా చేసిన బీర్బల్ ని అభినందించి, తన పేరు బీర్బల్ గా మార్చి దర్బార్ లో విదూషకుడుగా నియమించుకున్నాడు అక్బర్ చక్రవర్తి.

  అలా, బీర్బల్ తన తెలివితేటలతో అక్బర్ ఆస్థానం లో 'నవరత్న' అని పిలవబడే 9 మంది విదూషకులలో ఒకరిగా స్థానం సంపాదించాడు.


0 comments: