జానకీపురం జమీందారు జనప్రియ వర్మ కు కొంతకాలంగా చిత్రమైన వ్యాధి పట్టుకుంది. హంసతూలికా తల్పం మీద ఎంత పొర్లినా నిద్ర పట్టక బాధపడసాగాడు. ఆస్థాన వైద్యుడు ఎన్ని మందులు ఇచ్చినా ఉపయోగం కనిపించలేదు. జమీ వ్యవహారాలు చూడను కూడా ఓపికలేక బాధపడ సాగాడు జమీందారు. జమీందారి భార్యకు భయం పట్టుకుంది. ఆమె దివానును పిలిపించి కుల గురువైన వల్లభాచార్యులకు వివరంగా లేఖ రాసి పంపమని కోరింది. వార్తాహరుడు తెచ్చిన ఆలేఖ చదివి వల్లభాచార్యులు బదులు రాసి ఇచ్చి పంపారు. ఆ లేఖాంశాలు విని జనప్రియ వర్మ ఆ మరునాడే దివానుతో కలిసి గురుకులానికి బయలేేరాడు.
వల్లభాచార్యులు సూచించిన విధంగానే ప్రాతఃకాలంలోనే అంతఃపురం నుంచి కాలినడకన కులదెైవమైన సూర్యదేవాలయం చేరి, ఆ భవనాశిలో స్నానమాచరించి, దేవుని అర్చించి గర్భాలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, ప్రసాదం స్వీకరించి, ఆలయం నుంచి గుఱ్ఱపు బగ్గీలో ప్రయాణం సాగించాడు. మధ్యాహ్నానికి మాదిరాజపురం చేరాక అక్కడి పూటకుళ్లమ్మ ఇంట్లో నేలపైకూర్చుని అరిటాకులో వేడివేడి జొన్న సంగటిలో, కొరివికారంలో ఉల్లినంచుకుంటూ తిని, అల్లం, కరివేప, కొత్తిమీర వేసిన జారు పెరుగుతో భోజనం చేసి, అక్కడినుంచి గుఱ్ఱపు స్వారీ చేస్తూ సాయం కాలానికి సోమేశ్వరాలయం చేరారు. అది ఎంతో పురాతన దేవాలయం, ఆ స్వామిని దర్శిస్తే శారీరక, మానసిక కష్టాలు తీరుతాయనీ ,ఆరోగ్యం కుదుటబడుతుందని ప్రజల విశ్వాసం. 101 మెట్లు ఎక్కి కొండ పైభాగాన ఉన్న స్వామిని దర్శించి, ప్రసాదం స్వీకరించి, అక్కడి చల్లని వృక్షాల కింద కొంత సమయం కూర్చుని, కొండదిగి కాలినడకన ప్రయాణం సాగించి సూర్యాస్తమయం అయ్యాక వల్లభాచార్యుల వారి గురుకులాశ్రమం చేరారు. వల్లభాచార్యులు జమీందారుని సగౌరవంగా ఆహ్వానించి, వేడినీరు స్నానానికి ఏర్పాటు చేసాడు. అనంతరం కమ్మని వేడివేడి భోజనం ఆకుకూర, రసం, మజ్జిగతో పెట్టించి విశ్రాంతి తీసుకోమని పడక ఏర్పాటు చేసాడు. ఒక తుంగ చాపమీద, పాత పంచ పరిచి ఉండగా జమీందారు పవళించగానే నిద్రలో మునిగిపోయాడు. ఆ గురుకులంలోనే తాను పూర్వం విద్యనభ్యసించడం వలన ఆ ప్రాంతమంతా సుపరిచితం. మరునాడు ప్రాతః కాలంలోనే ఆచార్యుల వెంట రెండు మైళ్ళ దూరంలో నదీస్నానం చేసివచ్చి ఆచార్యునితో పాటుగా పూజాదికార్యక్రమాలలో పాల్గొని, శిష్యులతో పాటు కూర్చుని కమ్మని ఫలాలు, వేడిపాలు సేవించాడు. ఆ తరువాత ఆచార్యులు, శిష్యులు అంతా కలిసి పూల మొక్కలు, కూరలపాదులు, ఫలవృక్షాలకు నీరు, ఎరువు పెట్టి, ఎండి పోయిన కొమ్మలు, ఆకులు తొలగించి వచ్చి విద్యాభ్యాసంలో మునిగారు. దివానుతో కలిసి తమ ఆశ్రమం చుట్టూ ఉన్న ప్రాంతాలను దర్శించి రమ్మని జనప్రియ వర్మకు ఆచార్యులు. మిట్టమధ్యాహ్నం వరకూ ప్రకృతిని దర్శించి వచ్చి, వేడివేడి సాత్విక భోజనం చేసాక, ఆశ్రమంలోని ఉసిరి, వేప వృక్షాల కింద ఆచార్యులతో పాటుగా కూర్చుని ముచ్చటించి, సాయంకాలం తిరిగి నడిచి నదీస్నానమాచరించి వచ్చి, ధ్యానాదులలో పాల్గొని, భుజించి పడకచేరగానే క్రమంగా నిద్రలోకి జారుకున్నాడు జనప్రియ వర్మ. ప్రాతఃకాలానికి అతడికి శరీరమూ, మనసూ హాయిగా ఉన్నాయి.
ఆమరునాడు నదీస్నానానికి వెళ్ళేటపుడు జనప్రియ వర్మ ఆశ్చర్యంతో, "ఆచార్యా! ఇంత హాయిగా నిద్రించి ఎంత కాలమైందో! మీరేదో మంత్రం పఠించి నాకు నిద్రను ప్రసాదించారు" అన్నాడు. బదులుగా ఆచార్యులు "కుమారా! ఏ మంత్రతంత్రాలూ లేవునాయనా! తిన్నదానికి తగిన శరీర శ్రమ చేయడమే ఆ మంత్రం. మన శరీర ‘మర’ కు పని కల్పించకపోతే తుప్పుపట్టడం ఖాయం. నీవు నీ జమీ గ్రామాల్లో జమీందారుగా కాక మారు వేషంలో సాధారణ పౌరునిగా సంచరించు. పేదప్రజల కష్టసుఖాలు పరిశీలించు. రైతుల ఇబ్బందులు గ్రహించు. ఉద్యోగుల నివేదికలుకాక నీ మనసు నివేదికతో పని సాగించు. సాత్వికాహారం మాత్రమే భుజించు, చూడూ 35 ఏళ్లకే నీ శరీరం, పొట్ట పెరిగిపోయాయి. ఈ మూడు రోజుల్లోనే నీలో మంచి మార్పు శారీరకంగానూ వచ్చింది. ప్రాతఃకాలంలో లోకబాధవుని వెచ్చని కిరణాలలో ఉద్యోగులతో జమీ విశేషాలు ముచ్చటిస్తూ నడక సాగించు. ఇక్కడ జీవించిన విధంగా నీ జీవనసరళిని మార్చుకో. కమ్మని నేయి, చిక్కనిపాలూ, పెరుగు, వెన్న, మాంసాహార భోజనం, శ్రమ లేకుండా కూర్చోడం ఇవన్నీ నీ శారీరక, మానసిక పరిస్థితులపై ప్రభావం చూపాయి. అంతేనాయనా! వెళ్ళిరా! పదికాలాల పాటు జనరంజకంగా పాలించు" అంటూ ఆశీర్వదించి పంపారు ఆచార్యులు.
story from the book - బాల నీతి కథలు








